డాక్టర్ దాసరి “దర్శకరత్న” బయోపిక్

డాక్టర్ దాసరి “దర్శకరత్న” బయోపిక్

 డాక్టర్ దాసరి “దర్శకరత్న” బయోపిక్

సినీరంగంలో బహుముఖ ప్రజ్ఞాశాలిగానే కాదు అన్నింటా తానై, అందరివాడుగా వెలుగొందిన దివంగత దర్శకరత్న దాసరి నారాయణరావు గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాంటి అరుదైన వ్యక్తి జీవితం ఇప్పుడు వెండితెరకెక్కబోతోంది. ‘దర్శకరత్న” పేరుతో ఆయన జీవితంలోని సంఘటనల సమాహారంతో రూపొందబోయే ఈ చిత్రాన్ని త్వరలో ప్రాంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇమేజ్ ఫిలింస్ పతాకంపై సీనియర్ దర్శకుడు ధవళసత్యం దర్వకత్వంలో తాడివాక రమేష్ నాయుడు నిర్మించే ఈ చిత్రం ముందస్తు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గతంలో రియల్ స్టార్ శ్రీహరి హీరోగా శ్రీశైలం వంటి భారీ బడ్జెట్ హిట్ సినిమాను ఇదే నిర్మాత నిర్మించిన సంగతి గుర్తుండే ఉంటుంది.  కాగా ఈ చిత్రం గురించిన విషయాలను తెలియజేసేందుకు  గురువారం హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్లో  చిత్ర యూనిట్  ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో చిత్ర యూనిట్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.  దర్శకుడు ధవళసత్యం తెలియజేస్తూ, చిత్ర పరిశ్రమలో మేరు శిఖరం అంత ఎత్హుకు ఎదిగి,  రచయితగా, దర్శక, నిర్మాతగా ఎందరెందరికో మార్గదర్శకుడైన దాసరి గారితో నాకున్న విడదీయలేని అనుబంధం ఈ చిత్రం చేసేందుకు నన్ను పురిగొల్పింది. దాంతో నాకు తెలిసిన,, ఆయన జీవితంలో నేను చూసిన అనేక సంఘటనలతో పాటు, ఆయనతో అనుబంధం ఉన్న అనేకమందిని సంప్రదించి, ఈ  చిత్రం స్క్రిప్ట్ ను అద్భుతంగా రూపకల్పన చేయడం జరుగుతోంది. తప్పకుండా దీనిని ఓ గొప్ప చిత్రంగా తెరకెక్కించేందుకు, దాసరి గారి పట్ల ఎనలేని అభిమానంతో పాటు మంచి అభిరుచి కలిగిన తాడివాక రమేష్ నాయుడు ముందుకు రావడం అభినందనీయం”  అని అన్నారు.
చిత్ర నిర్మాత తాడివాక రమేష్ నాయుడు మాట్లాడుతూ, కరోనా మూడవ వేవ్ రాకుంటే ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ ఆరంభించే వాళ్లం. కరోనా పరిస్థితులు అదుపులోనికి రాగానే షూటింగ్ మొదలు పెడతాం. జాతీయ స్థాయి నటుడు ఈ చిత్రంలోని దాసరి గారి పాత్రను పోషిస్తారు. అలాగే దాసరి పద్మ పాత్రలో  గుర్తింపు ఉన్న నటి  నటిస్తారు. తెలుగు, హిందీ, తమిళ వంటి ఇండియాలోని పలు భాషలలో  ఓ పాన్ ఇండియా సినిమాగా ఎక్కడా రాజీ పడకుండా దీనిని రూపొందిచనున్నాం. అలాగే సీనియర్ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేయనున్నారు. దాసరి గారి బయోపిక్ కు పూర్తి న్యాయం చేయగల దర్శకుడిగా ధవళసత్యం మాత్రమే కరెక్ట్ అని నాకు అనిపించడంతో ఆయనను సంప్రదించాను” అని చెప్పారు.
ఇదే ప్రెస్ మీట్లో పాల్గొన్న రేలంగి నరసింహారావు, సీనియర్ సంపాదకులు రామచంద్రమూర్తి, నిర్మాతల మండలి  కార్యదర్శులు ప్రసన్నకుమార్, మోహన్ వడ్లపట్ల, నటుడు కాశీ విశ్వనాధ్, జూబ్లీహిల్స్ కార్పొరేటర్ ఖాజా సూర్యనారాయణ, తెలంగాణా ఫిలిం ఛాంబర్ చైర్మన్ పి.రామకృష్ణగౌడ్, సీనియర్ జర్నలిస్ట్ వినాయకరావు తదితరులు దాసరి వ్యక్తిత్వాన్ని, సేవాగుణాన్ని, ఆయనతో తమకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ మాట్లాడారు.