`కొండ‌పొలం` కమర్షియల్ అంశాల‌తో కూడిన సందేశాత్మ‌క చిత్రం – హీరో వైష్ణవ్ తేజ్

`కొండ‌పొలం` కమర్షియల్ అంశాల‌తో కూడిన సందేశాత్మ‌క చిత్రం – హీరో వైష్ణవ్ తేజ్

`కొండ‌పొలం` కమర్షియల్ అంశాల‌తో కూడిన సందేశాత్మ‌క చిత్రం – హీరో వైష్ణవ్ తేజ్

ఉప్పెన లాంటి బ్లాక్ బస్టర్ చిత్రం తరువాత మెగా సెన్సేషన్ వైష్ణవ్ తేజ్ రెండో చిత్రంతో అందరినీ మెస్మరైజ్ చేసేందుకు రెడీ అయ్యారు. క్రిష్ దర్శకత్వంలో రాబోతోన్న కొండపొలం సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ నటిస్తున్నారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌ మీద జే సాయి బాబు, వై రాజీవ్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 8న విడుదలకాబోతోంది. ఇక ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా గురువారం వైష్ణవ్ తేజ్ మీడియాతో ముచ్చటించారు.

కొండపొలం అనే అంశమే కొత్తది. నేను ఎప్పుడూ వినలేదు. పైగా క్రిష్ గారి సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన మేకింగ్ అంటే ఇంకా ఇష్టం. కొత్త కథ చెప్పాలని అనుకున్నారు. అందుకే ఈ కథను ఓకే చేశాను. మొదటగా క్రిష్ గారు ఫోన్ చేసినప్పుడు సినిమా కోసం కాదని అనుకున్నాను. ఊరికే రమ్మంటున్నారేమో అనుకున్నాను. కానీ సినిమా అని చెప్పిన తరువాత హరిహర వీరమల్లు తరువాత ఉంటుందేమో అనుకున్నాను. కానీ వెంటనే ప్రారంభిస్తున్నామని చెప్పారు.

క్రిష్ గారు కొండపొలం గురించి చెప్పినప్పుడు.. ఇంకా ఉప్పెన విడుదల కాలేదు. ఆయన తీసిన వేదం, గమ్యం నాకు చాలా ఇష్టం. నన్ను క్రిష్ గారు సంప్రదించడంతో ఎంతో సంతోషంగా ఫీలయ్యాను.

కొండపొలం సినిమాలో కమర్షియల్ అంశాలు ఉంటాయి. మంచి సందేశాత్మక చిత్రం కూడా. రంగస్థలం నుంచి అందరూ సినిమాను చూసే కోణం మారిపోయింది. ఇందులో ప్రతీ ఒక్క ఎమోషన్ ఉంటుంది.

ఉప్పెనలో ఫిషర్ మ్యాన్ పాత్రను పోషించాను. దానికి తగ్గట్టుగానే నా మేకోవర్ ఉంటుంది. ఇక ఇందులోనూ అంతే రగ్డ్ లుక్‌లోనే కనిపిస్తాను. నా మూడో సినిమాగా కమర్షియల్, లవ్ స్టోరీ చేస్తున్నాను. అందులో నా లుక్ వేరేలా ఉంటుంది.

కరోనా సమయంలో ఇంట్లోనే ఉండ‌డం వ‌ల్ల వెంట‌నే షూటింగ్ చేయడం మరీ అంత కష్టంగా ఏమీ అనిపించలేదు. కొండలు ఎక్కేవాళ్లం, రెండు మూడు కిలోమీటర్లు నడిచేవాళ్లం. అదేం పెద్ద కష్టంగా అనిపించలేదు. కానీ ఆ ఎండల్లో రోజంతా మాస్కులు పెట్టుకుని ఉండటం రెండు మూడు రోజులు  కష్టంగా అనిపించింది. కానీ ఆ తరువాత అలవాటైపోయింది.

ఏమీలేని స్థాయి నుంచి ఎంతో ఎత్తుకు ఎదిగే ఓ కుర్రాడి కథ. అడవి అంటే ఇష్టం, ఆ అడవి, అక్కడి అమ్మాయితో  ప్రేమలో పడే  కుర్రాడి జీవిత ప్రయాణం, ఆ గ్రాఫ్ బాగుంటుంది. ఈ కథ, పాత్ర చాలా కొత్తగా అనిపిస్తుంది. ఈ చిత్రంలో పూర్తిగా అక్కడి యాసలో మాట్లాడాను. ఉప్పెనలో  కొన్నిచోట్ల ప్రేక్షకులకు అర్థం కాద‌ని  యాస వాడలేదు. కానీ కొండపొలంలో పూర్తిగా  అక్కడి యాసలోనే మాట్లాడాను.

కొండపొలంలో అందరూ సీనియర్స్ నటించారు. అందరి దగ్గరి నుంచి చాలా నేర్చుకోవచ్చని అనుకున్నాను. వారు డైలాగ్స్‌ను ఇట్టే చెప్పేసేవారు. నాకు చాలా టెన్షన్‌గా అనిపించేది. కోట గారు ఆ వయసులో వచ్చి నటించడం చాలా గ్రేట్ అనిపించింది. ఆయన వచ్చినప్పుడు మాత్రం అందరం మాస్కులు పెట్టేసుకునేవాళ్లం. సాయి చంద్ గారు ఎప్పుడూ ఎంతో  ఎనర్జీగా ఉండేవారు. అంతే ఎనర్జీగా నటించేవారు.

ఏమీ లేని స్థాయి నుంచి ఎన్నో కష్టాలను దాటుకుని ఎంతో ఎత్తుకు ఎదగడమే కొండపొలం కథ. అడవితో ప్రేమలో పడతాడు. అడవిలాంటి అమ్మాయి ఓబులమ్మ. ఇది చాలా కొత్త కథ. పెద్ద హీరోల సినిమాలు చూసినప్పుడు నాకు కూడా అలాంటి కథలు చేయాలనిపిస్తుంది. ప్రభాస్ అన్న అలా కొడుతున్నాడు.. నాక్కూడా కొట్టాలనిపిస్తుంది. మా ఫ్యామిలీకి కూడా నన్ను అలా చూడటం ఇష్టం. అదే సమయంలో కొత్త కథలు ఎంచుకోవాలనిపిస్తుంది.

గిరి సాయి చిత్రం బాబీ గారి ప్రొడక్షన్‌లో రాబోతోంది. రామ్-కామ్ కాన్సెప్ట్‌. అడ‌విలో ఎక్కువ రోజులు షూటింగ్ చేయ‌డం వ‌ల్ల చాలా విష‌యాలు నేర్చుకున్నాను. ముఖ్యంగా మనకు అడవి ఎంతో ఆక్సిజన్‌ను ఇస్తుంది. ఎక్కువగా చెత్త వేయకూడదనిపించింది. చిన్న చిన్న పురుగులుంటాయని ఎంతో జాగ్రత్తగా నడిచేవాడిని.

మొదట్లో గొర్రెల భాషను అర్థం చేసుకోలేకపోయాను. తలపొట్టేలు నడిచినట్టుగానే మిగతా గొర్రెలు కూడా నడుస్తాయి. వాటికి పచ్చళ్లు అంటే ఇష్టమని తరువాత తెలిసింది. దాంతో ఆ పికిల్స్‌తో వాటిని కంట్రోల్ చేయ‌డానికి ట్రై చేశాం.

నిర్మాతలు చాలా మంచివారు. రాజీవ్ అన్నను చూస్తే సొంత మనిషిలా అనిపించేవారు. మా బాబాయ్‌ను చూసినట్టు అనిపించేది. ఆయన సెట్‌లో ఎక్కువగా కనిపించరు. కానీ జరగాల్సిన పనులన్నీ కూడా టైంకి జరిగిపోతుంటాయి.

ఎంతో అదృష్టం చేసుకుని ఉంటాను. అందుకే కీరవాణి గారితో  పని చేయగలిగాను. ఆయన కుమారుడు కాళ భైరవ నాకు స్నేహితుడు. కీరవాణి గారిని చూసినా, మాట్లాడినా మా కాళ భైరవ గుర్తుకు వస్తాడు. నా రెండో సినిమాకే ఆయనతో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది.

కొండపొలం కోసం ప్రత్యేకంగా వర్క్ షాప్‌లాంటివేమీ చేయలేదు. కానీ కొన్ని పదాలు మాత్రం అలానే మాట్లాడాలంటూ క్రిష్ గారు చెప్పేవారు. ఇక ప్రతీ రోజూ గొర్రెలతో ఉండేవాళ్లం కాబట్టి..  పాత్రలో రోజురోజుకూ లీనమైనట్టు కనిపించేది.

స్క్రిప్ట్‌కు తగ్గట్టు కథ చేశారా? లేదా? అని ఇప్పుడే నేను చెప్పలేను. నాకు ఆ అనుభవం కూడా లేదు. ఇక నా నటన గురించి మీరే చెప్పాలి.  నా నటన గురించి నేను జడ్జ్ చేసుకోవడం కంటే దర్శకుడు చెబితేనే బాగుంటుంది. కొన్ని సార్లు మనం బాగా చేశామని మన మనసు చెబుతుంది. అలాంటప్పుడు మానిటర్ చూస్తాను.

కెమెరామెన్ చాలా అద్భుతమైన వ్యక్తి. ఎంతో కామ్‌గా ఉంటారు. ఎప్పుడూ అరిచినట్టు కూడా కనిపించలేదు. ఎంతో సింపుల్‌గా ఉంటారు.

రిపబ్లిక్ చిత్రంలో అన్నయ్య ఐఏఎస్, నేను ఇందులో ఐఎఫ్ఎస్. కానీ రిపబ్లిక్, కొండపొలం సినిమాకు సంబంధం ఉండదు.  అన్నయ్య (సాయి ధరమ్ తేజ్) బాగున్నారు. త్వరగా కోలుకుంటున్నారు. ఇప్పుడు ఫిజియోథెరపీ జరుగుతోంది. తొందర్లనే బయటకు వస్తారు.

మా మామయ్యలు, అన్నయ్యకు ఇమేజ్ రావడం నేను చూశాను. కానీ నాకు ఇలా వస్తుందని, ఇలా వస్తే ఎలా ఉండాలో కూడా ఆలోచించలేదు. ఎక్క‌డికైనా బ‌య‌ట‌కు వెళ్లిన‌ప్పుడు అంద‌రూ న‌న్ను చూస్తుంటే చాలా సిగ్గుగా ఉంది (నవ్వుతూ).

ఓటీటీ ఆఫర్లు ఇప్పటికి రాలేదు. వస్తే తప్పకుండా న‌టిస్తాను. ప్రస్తుతానికి అయితే గిరి సాయి (తమిళ అర్జున్ రెడ్డి దర్శకుడు) దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్నాను.