‘Ninu Veedani Needanu Nene’ pre-release event

‘Ninu Veedani Needanu Nene’ pre-release event

'Ninu Veedani Needanu Nene' pre-release event

నా కెరీర్‌లో మోస్ట్ స‌క్సెస్‌ఫుల్ సినిమా ‘నిను వీడ‌ని నీడ‌ను నేనే’  

– ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌లో సందీప్ కిష‌న్‌
 
సందీప్ కిషన్ కథానాయకుడిగా నటించి, నిర్మిస్తున్న చిత్రం ‘నిను వీడని నీడను నేనే’. అన్యా సింగ్ కథానాయిక. కార్తీక్ రాజు దర్శకుడు. వెంకటాద్రి టాకీస్ (ప్రొడక్షన్ నంబర్ 1), వి స్టూడియోస్, విస్తా డ్రీమ్ మర్చంట్స్ పతాకాలపై సినిమా తెరకెక్కింది. దయా పన్నెం, సందీప్ కిషన్, విజి సుబ్ర‌హ్మ‌ణ్య‌న్ నిర్మాతలు. ఎస్.ఎస్. తమన్ సంగీత దర్శకుడు. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ అనిల్ సుంకర సమర్పణలో రూపొందిన ఈ సినిమా శుక్రవారం (జూలై 12న) విడుదల కానుంది. బుధవారం రాత్రి హైద‌రాబాద్‌లో ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ నిర్వ‌హించారు. యువ హీరోలు నిఖిల్, సుధీర్ బాబు ముఖ్య అతిథులుగా, ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ, ‘ఫ‌ల‌క్‌నుమా దాస్‌’ ఫేమ్ విశ్వక్ సేన్ అతిథులుగా హాజరయ్యారు. వీళ్లకు సినిమా సెకండ్ టికెట్‌ను సందీప్ కిషన్ అందజేశారు. సెంటిమెంట్‌గా ఫ‌స్ట్ టికెట్ ఎవ‌రికి ఇస్తామ‌నేది గురువారం చెబుతామ‌ని సందీప్ తెలిపారు. ఈ ఫంక్ష‌న్‌ను ‘జె మీడియా ఫ్యాక్టరీ’ నరేంద్ర ఆర్గనైజ్ చేశారు. మంజుష, భార్గవ్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఛాయాగ్రాహకుడు ఛోటా కె. నాయుడు, APR ప్రాజెక్ట్స్ అధినేత సంజీవ్ రెడ్డిగారు, టైల్స్ మార్ట్ అధినేత జగ్గారావుగారు, సుప్రియగారు, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు శివ చెర్రి, సీతారామ్ తదితరులతో పాటు యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. 
 
సుధీర్ బాబు మాట్లాడుతూ “సాధారణంగా సినిమా విడుదలైన తరవాత హిట్టయినా? ఫ్లాపయినా? క్రెడిట్ మొత్తం హీరోకి కట్టేస్తారు. హిట్టయితే హీరో బాగా చేశాడని, మంచి కథ సెలెక్ట్ చేసుకున్నాడని అంటారు. ఫ్లాప్ అయితే, డబ్బులు పోతే హీరో ఓపెనింగ్స్ తీసుకురాలేకపోయాడని అంటారు. ఇప్పుడు సందీప్ కిషన్ నిర్మాత అయ్యాడు కాబట్టి… గుడ్ ఆర్ బ్యాడ్ అతణ్ణి డైరెక్టుగా అనవచ్చు. నేను కలిసిన వెరీ వెరీ గుడ్ యాక్ట‌ర్స్‌లో సందీప్ కిష‌న్ ఒక‌డు. అతడి పొటెన్షియల్ ప్రేక్షకులకు ఇంకా  తెలియలేదని నా ఫీలింగ్. అతనితో కలిసి ‘శమంతకమణి’లో నటించాను. అతని సినిమాలు కూడా చూస్తుంటాను. ఆఫ్ స్క్రీన్… సందీప్ కిషన్ సినిమాలను బాగా ఎనాలసిస్ చేస్తాడు. అతని లాస్ట్ రెండు సినిమాలు అంచనాలను చేరుకోలేదు. ఇప్పుడు తనే ప్రొడ్యూస్ చేస్తున్నాడు. టీమ్ అందరినీ ప్రోపర్‌గా సెట్ చేసుకున్నాడు. హార్ట్ అండ్ సోల్ పెట్టి సినిమా చేశాడు. తప్పకుండా హిట్ అవుతుంది. ఇప్పుడు నాకు కూడా ఇంకో నిర్మాత దొరికాడు. తనతోనే మాత్రమే కాకుండా, ఇతరులతో సందీప్ సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. నాకు ఫ్లాప్స్ వస్తే డిప్రెషన్ లోకి వెళ్లిపోతా. ఎప్పుడైనా వరుసపెట్టి రెండుమూడు ఫ్లాప్స్ వస్తే సందీప్ కిషన్ ని గుర్తు చేసుకుంటా. అతను ఫైట్ చేసిన తీరును గుర్తు చేసుకుంటా” అని అన్నారు.
 
నిఖిల్ మాట్లాడుతూ “సందీప్ కిషన్ అమేజింగ్ హ్యూమన్ బీయింగ్. సినిమా యాక్టర్ల మధ్య కాంపిటీషన్ ఉంటుందని, వాళ్ల సినిమాల గురించి వీళ్లు మాట్లాడుకుంటారనేవి మధ్యలో మనుషులు చెప్పే విషయాలని సందీప్ కిష‌న్‌ని క‌లిసిన త‌రవాత అర్థ‌మైంది. మేం ఎప్పుడూ మాట్లాడుకునేవాళ్లం కాదు. ఒక్కసారి మాట్లాడటం మొదలుపెట్టిన తరవాత మాటలు ఆగలేదు. ఆడియో ఫంక్ష‌న్స్‌కి అంటే నాకు భ‌యం. వస్తే ఏం మాట్లాడాలో అర్థం కాదు. కానీ, ఈ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌కి వ‌స్తాన‌ని నేనే సందీప్ కిష‌న్‌కి కాల్ చేశా. ఈ సినిమా విషయానికి వస్తే… ‘వెన్నెల’ కిషోర్‌తో నా సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు క్యాజువల్ గా ‘నిను వీడని నీడను నేనే’ బాగా వస్తుందని చెప్పాడు. కొంతమందికి కాల్ చేశా. అందరూ బాగా వస్తుందని చెప్పారు. వెంటనే సందీప్ కిష‌న్‌కి ఫోన్ చేసి ‘నేను కూడా నీ  సినిమాలో ప్రొడ్యూస‌ర్‌గా జాయిన్ అవ్వొచ్చా?’ అని అడిగా. సాధారణంగా నేను డబ్బులు పెట్టడానికి ఆలోచిస్తా. కానీ, టాక్ విని డబ్బులు పెట్టాలనుకున్నా. చాలామంది నిర్మాతలు ఉన్నారని చెప్పాడు. జీవితంలో మనం కింద పడతాం. పైకి లేస్తాం. ఎప్పుడూ డిజప్పాయింట్ అవ్వకూడదు. ఈ సినిమా తరవాత సందీప్ కిషన్ పైన ఉంటాడు. తను పైకి లేచే టైమ్ మొదలైంది. ఎవరూ ఆపలేరు” అని అన్నారు. 
 
సందీప్ కిషన్ మాట్లాడుతూ “నేను ఎప్పుడూ నా సినిమా ఫంక్ష‌న్స్‌లో మంచి సినిమా తీశాన‌ని చెబుతా. ఫ‌స్ట్‌టైమ్ చెబుతున్నా… అదిరిపోయే సినిమా తీశా. ప‌క్కా హిట్ అయ్యే సినిమా తీశా. అది నేనొక్కడినే తీశానని చెప్పడం లేదు. టీమ్ కృషి వల్ల కుదిరింది. సినిమా కోసం అందరం కష్టపడతాం. కానీ, కుదరాలి. ఈ సినిమాకి కుదిరింది. నా కెరీర్‌లో మోస్ట్ స‌క్సెస్‌ఫుల్ సినిమా ‘నిను వీడ‌ని నీడ‌ను నేనే’. ఎందుకు అంటే… సెట్‌లో, టీమ్‌లో ఎవరికీ ఏ లోటు చేయలేదు. ఇవాళ్టి వరకూ ఒక్క రూపాయి కూడా మోసం చేయలేదు. సినిమాను మాత్రమే తీశాం. సినిమాను మాత్రమే ప్రమోట్ చేశాం. ప్రేక్షకుల దగ్గర సినిమాయే మాట్లాడుతుంది. నిజాలు మాట్లాడుకోవాలంటే… ఈ రోజు ఉదయం వరకూ సినిమా విడుదల అవుతుందో? లేదో? మాకు తెలియదు. అంత టెన్షన్. నాకు తెలిసింది ఒకటే… కథను నమ్మాలి. ఆ కథను బాగా తీయాలి. కరెక్టుగా ప్రమోట్ చేయాలి. జనాల్లోకి తీసుకువెళ్లాలి. మన పని మనం చేసుకుంటూ వెళతాం.  కానీ, ఒకడు ఒక సినిమా తీస్తున్నాడంటే… సంబంధమే లేకుండా ఆ సినిమాను ఆపడానికి బయలుదేరతారు. అందరి కన్నా.. అన్నిటి కన్నా సినిమా గొప్పది. ఆ సినిమాను ఆ సినిమా కాపాడుకుంటూ వస్తుంది. అదే ‘నిను వీడని నీడను నేనే’. ఈ సినిమాకు విపరీతమైన అడ్డంకులు వచ్చాయి. నాకే షాక్. ఇదొక మిరాకిల్. నేను, మా ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు శివ చెర్రీ, సీతారామ్ కూర్చుని ఇటువంటి చిక్కులు వచ్చాయేంటని ఆలోచించుకుంటూ ఉంటే మరుసటి రోజుకు చిక్కులు తొలగిపోయేవి. ఎలాగో మాకూ తెలియదు. మంగళవారం అయితే హై టెన్షన్ మూమెంట్. ఏం జరుగుతుందో తెలియదు. శివ, సీతారామ్ ఏడుస్తున్నారు. వీళ్లిద్దరూ లేకపోతే నేను లేను. వీళ్లను నాకు దేవుడు ఇచ్చిన ఫ్యామిలీ అనొచ్చు. ఫ్రెండ్స్ అనొచ్చు. వీళ్లే సినిమాను ఇక్కడి వరకూ తీసుకొచ్చారు. అలాగే. మా ఎడిటర్ ఛోటా కె. ప్రసాద్, రైటర్ సామ్రాట్ ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేశారు. ‘ఎస్ఎమ్ఎస్‌’కి 77మంది దగ్గర అప్పు చేస్తే గానీ సినిమా కుదరలేదని సుధీర్ బాబు చెప్పాడు. ఒక మనిషి 77 మంది దగ్గర అప్పు ఎలా చేస్తాడని నాకు అర్థం కాలేదు. ఇవాళ నాకు అర్థమైంది. రామజోగయ్య శాస్త్రిగారు కథకు కీలకమైన పాట రాశారు. ఆయన తప్ప ఇంకెవరూ రాయలేరు. ఆ పాటను మేము విడుదల చేయలేదు. సినిమాలోనే చూడాలి. విడుదల రోజున ఆ పాటను అందరికీ వినిపిస్తాం. ఈ కథ ఈ టైమ్‌లో నా దగ్గ‌ర‌కు రావ‌డం అదృష్టం. ఈ నెల 12న సినిమాను చూడండి. తప్పకుండా హిట్ అవుతుంది. కాన్ఫిడెంట్‌గా ఉన్నాను” అని అన్నారు.
 
కార్తికేయ మాట్లాడుతూ “నా సినిమా ఫంక్ష‌న్స్‌కి, ఇత‌రుల ఫంక్ష‌న్స్‌కి ఎప్ప‌డూ వెళ్ల‌లేదు. నన్ను ఎవరూ గెస్ట్‌గా పిల‌వ‌లేదు. ఫస్ట్ టైమ్ సందీప్ అన్న పిలిచారు. నాకంటే సీనియర్ అయినా… నేను జిమ్‌లోనూ కానీ, బయట ఎక్కడైనా కనిపించినా సందీప్ అన్న చక్కగా మాట్లాడతారు. ఆయనను చూస్తే నాకు తెలియకుండా ‘బిగ్ బ్రదర్’ అనే ఫీలింగ్ వస్తుంది. సినిమాలపై ఆయనకున్న ప్రేమ నన్ను ఇన్‌స్ఫైర్ చేస్తుంది. డిఫరెంట్ సినిమాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు తానే నిర్మాతగా మారారు. ‘హిప్పీ’ ప్లాప్ తరవాత నేను కోలుకోవడానికి టైమ్ పట్టింది. ఏడెనిమిదేళ్లల్లో సందీప్ అన్న ఎన్నో అప్ అండ్ డౌన్స్ చూశారు. స్ట్రాంగ్‌గా నిల‌బ‌డ్డారు. ద‌ట్స్ రియ‌ల్లీ ఇన్‌స్ఫైరింగ్‌. జూలై 12న లాస్ట్ ఇయర్ మా ‘ఆర్ ఎక్స్ 100’ విడుదలైంది. ఈ ఇయర్ ‘నిను వీడని నీడను నేనే’ వస్తుంది. ఈ సినిమా టీజర్, ట్రైలర్ చాలా బావున్నాయి. ఇదీ బ్లాక్‌బ‌స్ట‌ర్‌ అవుతుంది” అని అన్నారు.  
 
విశ్వక్ సేన్ మాట్లాడుతూ “సినిమా ప్రొడ్యూస్ చేయడం పుణ్యం. సెట్ మీద రోజుకు మూడుసార్లు అన్నదానం జరుగుతుంది. నేను సినిమా చేసినన్ని రోజులూ ప్యాకప్ చెప్పిన తరవాత అలసట కంటే ఇంతమందికి మనం భోజనం పెడుతున్నామనే సంతృప్తి ఉండేది. అదీ మంచి మనసుతో, సినిమాపై పిచ్చితో చేస్తే.. ఆ సినిమాకు ఎప్పుడూ హాని జరగదు. తప్పు జరగదు. సందీప్ కిషన్‌లో అదే ప్యాషన్ చూశాను. తనను ఎవరో నిర్మాత ఏదో అన్నారట. ఆయన సందీప్ కిషన్ చేసిన పాతిక సినిమాలు మర్చిపోయినట్టున్నారు. ఆ సినిమాలు ఇండస్ట్రీలో ఎంతోమందికి భోజనం పెట్టాయి. నేను ముంబైలో ఫిల్మ్ స్కూల్‌కి వెళ్లినప్పుడు ‘షోర్ ఇన్ ది సిటీ’ వచ్చింది., అప్పుడు ‘ఇండస్ట్రీలో ఉండిపోవడానికి ఈ సందీప్ వచ్చాడు’ అనుకున్నా. నా గెస్ ఎప్పుడూ రాంగ్ కాలేదు. నన్ను ఇన్‌స్ఫైర్ చేసిన‌ ఫస్ట్ పర్సన్ సందీప్ కిషన్. తనకు ఆల్ ది బెస్ట్. కొత్త రకం సినిమాతో వచ్చాడు. తప్పకుండా హిట్ అవుతుంది” అని అన్నారు.
 
దయా పన్నెం మాట్లాడుతూ “సందీప్ కిషన్ నాకు బెస్ట్ ఫ్రెండ్, బ్రదర్. ఇప్పుడు పార్ట్‌న‌ర్స్ అయ్యాం. యాక్చువల్లీ, నేను సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసుకుంటూ అమెరికాలో ఉంటాను. సినిమాలు నేటి ఫాషన్. ఎగ్జిబిషన్, డిస్ట్రిబ్యూషన్‌తో సినిమా ఇండ‌స్ట్రీలో జ‌ర్నీ స్టార్ట్ చేశా. సందీప్‌తో మంచి బాండింగ్ ఏర్ప‌డింది. తను ఎప్పుడు అమెరికాకు వచ్చినా కలుస్తుంటాం. సినిమాల గురించి డిస్కస్ చేస్తుంటాం. ఒకసారి మనమే బ్యానర్ స్టార్ట్ చేసి మంచి సినిమాలు చేద్దామనే ఆలోచన వచ్చింది. రెగ్యులర్ కాకుండా డిఫరెంట్ టైప్ సినిమాలు ప్రొడ్యూస్ చేద్దామని. హాలీవుడ్‌లో ఒక ఇండిపెండెంట్ సినిమా ప్రొడ్యూస్ చేశా. అది ఆస్కార్ నామినేషన్ వరకూ వెళ్లింది. సినిమాలంటే నాకు అంత ఫాషన్. మంచి కథ, తమన్ గారు మంచి మ్యూజిక్, ఎన్నో సంవత్సరాల తరవాత సిద్ధార్థ్ గారు పాడటం, లిరిక్స్, మంచి టెక్నీషియన్లు మా బ్యానర్ లో చేసిన ఈ ఫస్ట్ సినిమాకు అన్ని బాగా కుదిరాయి. మా బ్యానర్లో ఇంకా మంచి మంచి సినిమాలు చేస్తాం. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుంది. నేను చూశా. సినిమాకు సందీప్ కిషన్ హార్డ్ వర్క్ చేశాడు” అని అన్నారు.    
 
దర్శకుడు కార్తీక్ రాజు మాట్లాడుతూ “ఈ సినిమా నాకు వెరీ వెరీ స్పెషల్. సందీప్ కిష‌న్‌కి స్క్రిప్ట్ వినిపిస్తే నటించడానికి మాత్రమే కాదు, నిర్మించడానికి కూడా ముందుకొచ్చారు. ఆయనతో పాటు మిగతా ఇద్దరు నిర్మాతలు దయా పన్నెం, వీజీ సుబ్ర‌హ్మ‌ణ్య‌న్ గారికి థాంక్స్. సినిమా విడుదల దగ్గరలో ఉంది కనుక ఎక్కువ మాట్లాడను. ప్రేక్షకులందరికీ సినిమా నచ్చుతుందని చెప్పగలను” అని అన్నారు.
 
అన్యా సింగ్ మాట్లాడుతూ “నా ఫస్ట్ తెలుగు మూవీ ‘నిను వీడని నీడను నేనే’. నా ఫస్ట్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఇది. సినిమాపై ఎంతో ప్రేమ కల ఈ టీమ్‌తో ప‌ని చేయ‌డం నా అదృష్టం. సినిమా చూసి నన్ను హీరోయిన్‌గా ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నా” అని అన్నారు. 
 
రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ “సందీప్ కిష‌న్‌కి నేనంటే గురి, ఇష్టం, ప్రేమ, అభిమానం. ఎప్పటి నుంచో ‘క్లైమాక్స్ లో ఒక కీలకమైన పాట ఉంటుంది. అది మీరే రాయాలి’ అనేవాడు. ఫైన‌ల్‌గా తమన్  ట్యూన్ ఇచ్చాక, విజువల్స్ చూసి ఇష్టంగా, ప్రేమగా రాశాను. నాకు సహాయం చేసిన దర్శకుడు కార్తీక్ రాజు, ఎడిటర్ ఛోటా కె. ప్రసాద్ కి థాంక్స్. కథ విన్నప్పుడు ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. పాట రాసే క్రమంలో కొన్ని విజువల్స్ చూశాను. బాగున్నాయి. అలాగే, సినిమాలో అతిథి పాత్రలో నటించాను. ప్రేక్షకులతో పాటు నేను సినిమాను ఎప్పుడు ఎప్పుడు చూస్తానా, నన్ను నేను తెరపై ఎప్పుడు చూసుకుంటానా అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నా. ఈ సినిమాతో నిర్మాతగా మారుతున్న సందీప్ కి ఆల్ ది బెస్ట్” అన్నారు.
 
పోసాని కృష్ణమురళి, మురళీ శర్మ, వెన్నెల కిశోర్, పూర్ణిమ భగ్యరాజ్, ప్రగతి తదితరులు నటించిన ఈ చిత్రానికి పీఆర్వో: నాయుడు సురేంద్రకుమార్ – ఫణి కందుకూరి, సంగీతం: ఎస్.ఎస్. తమన్, ఛాయాగ్రహణం: ప్రమోద్ వర్మ, ఎడిటింగ్: చోటా కె. ప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్: విదేష్, ఎగ్జక్యూటివ్ ప్రొడ్యూసర్: శివ  చెర్రీ, సీతారామ్, కిరుబాక‌ర‌న్‌, నిర్మాతలు: దయా పన్నెం, సందీప్ కిషన్, విజి సుబ్ర‌హ్మ‌ణ్య‌న్, దర్శకుడు: కార్తీక్ రాజు.